హిందూ దేవుళ్లను కించపరిస్తే వదలిపెట్టం 

హిందూ దేవుళ్లను కించపరిస్తే వదలిపెట్టం 

హైదరాబాద్: హిందూ దేవుళ్లను కించపరిచిన వారిని వదిలిపెట్టబోమని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ హెచ్చరించారు. హిందూ దేవుళ్లపై ఇద్దరు యువతీ, యువకులు చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ విషయంపై రాజా సింగ్ సీరియస్ అయ్యారు. హైటెక్ సిటీలోని బడా కంపెనీల్లో పనిచేసే కొంతమంది ఉద్యోగులు.. పనీ, పాటా లేని వాళ్లు హిందూ దేవుళ్లను కించపరుస్తూ కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ దేవుళ్లపై అభ్యంతరకర కామెంట్‌లు చేసిన వారిని జైలుకు పంపేదాకా వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు సదరు యువతీ, యువకులు మాట్లాడిన వీడియోతోపాటు పూర్తి వివరాలను పోలీసు కమిషనర్‌‌కు లేఖ ద్వారా తెలిపామన్నారు. వారిని 24 గంటల్లోగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మీడియా ముందు వారిని ప్రవేశ పెట్టాలన్నారు. ఎంఐఎంపై ఎవరైనా కామెంట్ చేస్తే వెంటనే అరెస్టు చేసే పోలీసులు.. హిందూ దేవుళ్లను కించపరిచిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. కామెంట్ చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తారనే నమ్మకం ఉందన్నారు. అరెస్టు చేయకపోతే తమ దగ్గర వారి అడ్రస్ ఉందని పేర్కొన్నారు.